మనం ఏడుస్తున్నామని మోదీ అంటున్నారు: స్టాలిన్ ఫైర్
- కేంద్ర నిధులు కోసం తమిళనాడు ప్రభుత్వం ఏడుస్తోందని మోదీ అంటున్నారని స్టాలిన్ మండిపాటు
- మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న సీఎం
- డీలిమిటేషన్ వల్ల ఎంపీ స్థానాలు తగ్గవని అమిత్ షా హామీ ఇవ్వాలని డిమాండ్
డీలిమిటేషన్ వల్ల లోక్ సభ స్థానాలు తగ్గవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును విముక్తి చేయాలని కోరారు. తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయరాదని అన్నారు.
ప్రధాని మోదీ ఇటీవల రామేశ్వరంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2014 ముందుకన్నా గత దశాబ్ద కాలంలో తమిళనాడుకు మూడు రెట్లు అధికంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని అన్నారు. తమిళనాడులో మౌలిక సదుపాయాలను పెంచడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. రైల్వే బడ్జెట్ లో తమిళనాడు కోటాను ఏడు రెట్లు పెంచామని తెలిపారు. తమిళనాడుకు ఎంత ఇచ్చినా... ఇంకా కావాలన్నట్టుగా కొందరు అంటున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మోదీపై స్టాలిన్ విమర్శలు గుప్పించారు.