KTR: కేటీఆర్ సగం సగం నాలెడ్జితో మాట్లాడుతున్నారు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

- ఐసీఐసీఐ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారని చెప్పారని విమర్శ
- సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కేటీఆర్కు నిద్రపట్టకపోయి ఉంటుందని వ్యాఖ్య
- రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని విమర్శించేందుకే కేటీఆర్ మీడియా సమావేశమని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశాలు రానురాను హాస్యాస్పదంగా మారుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి ఐసీఐసీఐ బ్యాంకులో రుణాలు తీసుకున్నారంటూ కేటీఆర్ సగం సగం అవగాహనతో మాట్లాడారని విమర్శించారు.
నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కేటీఆర్కు నిద్రపట్టకపోయి ఉంటుందని అన్నారు. రేవంత్ రెడ్డిపై ఏం విమర్శలు చేద్దామా అని రాత్రంతా సిద్ధమయి ఉంటాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ఎప్పుడు లక్ష్యంగా చేసుకొని మాట్లాడదామా అనే ఉద్దేశంతో హడావుడిగా బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి విషయం తెలిసీ తెలియకుండా మాట్లాడారని విమర్శించారు.
రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికే కేటీఆర్ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర సాధికారత కమిటీ పూర్తి నివేదికను సమర్పించడానికి కోర్టును సమయం కోరిందని తెలిపారు.