Narendra Modi: 2029 తర్వాత నరేంద్ర మోదీ ఉండేది జైల్లోనే: 'ఏయ్ మోదీ' అంటూ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు

- బ్రిటిష్ వాళ్లకే భయపడని పార్టీ కాంగ్రెస్ అన్న అద్దంకి దయాకర్
- మోదీ, అమిత్ షా కేడీలు అంటూ ధ్వజం
- దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టారని ఆరోపణ
2029 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైలులోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నరేంద్ర మోదీ పదవీకాలం 2029 వరకేనని అన్నారు. ఆ తర్వాత ఆయనను తరిమికొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.
ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెడుతోందని దయాకర్ ఆరోపించారు. "ఏయ్ మోదీ, బీజేపీ మోదీ, బ్రిటిష్ వారికే భయపడని కాంగ్రెస్ ఇది. బీజేపీకి భయపడుతుందని ఎలా అనుకుంటున్నారు? మోదీ, అమిత్ షా కేడీలు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం మీద వీరు కక్ష కట్టారు" అని తీవ్రంగా విమర్శించారు.
స్వతంత్ర్య సంగ్రామంలో బీజేపీ పాత్ర ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశారు. సెంటు భూమి, ఇల్లు కూడా లేని గాంధీ కుటుంబం మీద కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక మోదీపై కేసు పెట్టి జైలుకు పంపలేమా? అని ప్రశ్నించారు. దొంగతనం చేసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై కేసులు పెడతారా అని ధ్వజమెత్తారు. మోదీ వంటి నాయకుడిని ఆరెస్సెస్ దేశానికి ఇచ్చిందని విమర్శించారు. ఆరెస్సెస్ విధానం ఇదేనా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రేమను పంచుతుంటే, మోదీ ద్వేషం పంచుతున్నారని వ్యాఖ్యానించారు. విడగొట్టే మోదీని తరిమికొట్టేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. మోదీ ప్రజాస్వామ్య ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు వస్తేనే బీజేపీ భయపడుతోందని, ఇక గెలిస్తే ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.