ఢిల్లీ, ముంబై రెడ్ జోన్‌లో ఉన్నాయి... ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే జబ్బు ఖాయం: గడ్కరీ

  • పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజల ఆయుర్దాయం తగ్గుతుందన్న గడ్కరీ
  • ప్రజలు శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని సూచన
  • ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిన సమయం వచ్చిందని వెల్లడి
కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై నగరాలు రెడ్ జోన్‌లో ఉన్నాయని, దేశ రాజధానిలో మూడు రోజులు ఉంటే అనారోగ్యం పాలవడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ రాజధానిలో నివసించే ప్రజల ఆయుర్దాయం పదేళ్లు తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికైనా శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ఆర్థిక వ్యవస్థకు ఇచ్చే ప్రాధాన్యతను పర్యావరణానికి కూడా ఇవ్వాలని అన్నారు.

పెట్రోల్, డీజిల్ కాలుష్యానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. వాహనాలలో ఉపయోగించే ఇంధనంలో మార్పు అవసరమని అన్నారు. భారతదేశం సుమారు రూ. 22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని గుర్తు చేశారు. వాటికి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ రంగాలలో ప్రపంచస్థాయి సదుపాయాలను కల్పించడంపై దృష్టి సారించిందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల లాజిస్టిక్ ఖర్చులు 12 శాతం లోపు ఉంటే మన ఖర్చులు 16 శాతం ఉన్నాయని అన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి మన ఖర్చులను సింగిల్ డిజిట్‌కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Nitin Gadkari
Delhi Air Pollution
Mumbai Air Pollution
Red Zone Cities
India's Economy
Environmental Concerns
Air Quality Index

More Telugu News