Ronanki Kurmanath: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన .. నేడు రాష్ట్రంలో వడగాలులు, వానలు..ఎక్కడెక్కడంటే..?

- రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు
- పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
- ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో నేటి వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు (14వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒకవైపు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరోవైపు వడగాలులు వీచే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని 98 మండలాల్లో సోమవారం వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
వడగాలులకు గురయ్యే మండలాల విషయానికి వస్తే అల్లూరు - 5, కాకినాడ - 9, కోనసీమ - 8, తూర్పు గోదావరి - 7, ఏలూరు - 8, కృష్ణా - 10, గుంటూరు - 13, బాపట్ల - 9, పల్నాడు - 5, ప్రకాశం - 6 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు.
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వడగాలులు, పిడుగుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.