నితీశ్ మానసిక ఆరోగ్యంపై మెడికల్ బులెటిన్ విడుదల చేయాలి: ప్రశాంత్ కిశోర్

  • నితీశ్ కుమార్ తన కేబినెట్ మిత్రుల పేర్లను మరిచిపోతున్నారన్న పీకే
  • రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆయనకు తెలియదని అర్థమైందన్న పీకే
  • నితీశ్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేస్తే వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్య
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన కేబినెట్ మిత్రుల పేర్లను మరిచిపోతున్నారని, పర్యటనలు చేస్తున్నప్పుడు ఆయన ఏ జిల్లాలో ఉన్నారో కూడా గుర్తుంచుకోవడం లేదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

బహిరంగ కార్యక్రమాలు, పత్రికా సమావేశాల్లో ముఖ్యమంత్రిని మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి సన్నిహితులు ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ మానసిక స్థితిపై సందేహాలు కలుగుతున్నాయని, ఆయన వైద్య నివేదికను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల బీపీఎస్సీ పరీక్షలపై జరిగిన ఆందోళన సమయంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆయనకు తెలియదనే విషయం తనకు అర్థమైందని ఆయన అన్నారు. ఆయన ఆరోగ్యంపై మెడికల్ బులెటిన్ విడుదల చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. అయితే, ఇలాంటి వాటికి ముఖ్యమంత్రి అస్సలు అంగీకరించరని చురక అంటించారు. నితీశ్ మానసిక ఆరోగ్యంపై ఆయన సన్నిహితుడు సుశీల్ మోదీ 2023లో మొదటిసారి ఆందోళన వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు.


More Telugu News

Prashant Kishor Nitish Kumar Jan Suraj JDU Bihar