స్టాలిన్ ప్రస్తుత కథానాయకుడు అయినప్పటికీ... హీరో రేవంత్ రెడ్డే: కేకే

  • డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే
  • ప్రతి రాష్ట్రానికి పార్లమెంట్ లో బలమైన ప్రాతినిధ్యం ఉండాలని వ్యాఖ్య
  • అమిత్ షా వంటి వ్యక్తులతో సమస్యలు పరిష్కారం కావన్న కేకే
డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ చెన్నైలో జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తెలిపారు. 

డీలిమిటేషన్ వ్యవహారంలో ప్రస్తుత కథానాయకుడు స్టాలిన్ అయినప్పటికీ... హీరో మాత్రం రేవంత్ రెడ్డేనని అన్నారు. హైదరాబాద్ లో సభ పెడతామని చెప్పడం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కీలక పరిణామమని చెప్పారు. ఈ సభ రాజకీయ అజెండాను మలుపు తిప్పే అవకాశం ఉందని అన్నారు.

డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ సీట్ల పెంపు గురించి మాత్రమే ఉండకూడదని అన్నారు. జనాభా గణన జరిగిన తర్వాత ప్రతిసారి ఇదే వివాదం తెరపైకి వస్తుందని చెప్పారు. పార్లమెంట్ లో ప్రతి రాష్ట్రానికి బలమైన ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫెడరలిజాన్ని పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు. స్టేట్ లిస్ట్ ను తగ్గించి, సెంట్రల్ లిస్ట్ ను పెద్దది చేశారని మండిపడ్డారు. దీని ఫలితంగా రాష్ట్రాల హక్కులు తగ్గిపోతున్నాయని చెప్పారు.

జమ్మూకశ్మీర్, అసోం వంటి ప్రాంతాల్లో సీట్లను పెంచే ప్రయత్నం చేస్తున్నారని... దక్షిణాదికి అన్యాయం జరిగేలా అడుగులు వేస్తున్నారని కేకే మండిపడ్డారు. అమిత్ షా వంటి వ్యక్తుల మైండ్ సెట్ తో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. 


More Telugu News

K Keshav Rao Revanth Reddy Stalin Telangana Delimitation Parliament Seats Amit Shah Modi South India Federalism