Sunita Williams: 9 నెలల నిరీక్షణకు తెర.. భూమిని చేరుకున్న సునీత.. వీడియో ఇదిగో!

తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు. సునీత, బుచ్ విల్మోర్‌‌, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండైంది.

గంటకు దాదాపు 27 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చిన డ్రాగన్ క్రూ క్యాప్సుల్ క్రమంగా వేగం తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాక దాని 4  పారాచూట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వేగాన్ని మరింత తగ్గించుకుని సుమద్ర జలాల్లో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది క్యాప్సుల్‌ను ఓ బోటుపైకి ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. 

అనంతరం లోపలున్న వ్యోమగాములను బయటకు తీసి హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వారు భూమి గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉంటారు. కాగా, క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో విడిపోవడం దగ్గరి నుంచి వ్యోమగాములు భూమికి చేరడం వరకు ఈ మొత్తం కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. 
Sunita Williams
NASA
Crew Dragon
ISS
International Space Station
Spaceflight
Florida
Space Return
Astronauts
Splashdown

More Telugu News