పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచే ఒంటిపూట బడులు

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రకటించాయి. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో పాఠశాలల సమయంలో మార్పులు చేశాయి.

తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రేపటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులను కొనసాగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో, విద్యాశాఖ విద్యార్థులకు రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రకటించింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని పేర్కొంది.

Telangana
Andhra Pradesh
School

More Telugu News