మరో కేసు... గుంటూరు జైలు నుంచి పోసానిని ఆదోనికి తరలిస్తున్న పోలీసులు

  • పోసానిని వెంటాడుతున్న వరుస కేసులు
  • ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో పోసానిపై మరో కేసు
  • పీటీ వారెంట్ పై పోసానిని అదుపులోకి తీసుకున్న ఆదోని పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. రోజుకు ఒక జైలు అన్నట్టుగా ఆయన జీవితం మారిపోయింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నరసరావుపేట పీఎస్ లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు. 

మరోవైపు కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా పోసానిపై కేసు నమోదయింది. దీంతో, ఆదోని త్రీ టౌన్ పోలీసులు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు నుంచి ఆయనను ఆదోనికి తరలిస్తున్నారు.

తొలుత పోసాని రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత నరసరావుపేట కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని... తనను నరసరావుపేట జైల్లో కాకుండా గుంటూరు జైలుకు తరలించాలని పోసాని కోరడంతో జడ్జి అంగీకరించారు. జడ్జి ఆదేశాల మేరకు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇప్పడు ఆదోని పోలీసులు ఆయనను ఆదోనికి తరలిస్తున్నారు.

Posani Krishna Murali
Tollywood

More Telugu News