కొనసాగుతున్న ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

West and East Godavari districts Graduate MLC Election votes counting ontinues
  • ఏపీలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు
  • నేడు ఓట్ల లెక్కింపు
  • కాసేపట్లో తేలనున్న ఫలితాలు
ఏపీలో ఫిబ్రవరి 27న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ హాల్ లో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 243 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి. 42 పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు కావని అధికారులు గుర్తించారు. 

ఓట్ల లెక్కింపుపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, 17 రౌండ్ల పాటు కౌంటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కాగా, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు కౌంటింగ్ సరళి చెబుతోంది. 

మరోవైపు, ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. కౌంటింగ్ కోసం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 371 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి. నియామవళికి విరుద్ధంగా ఉన్న 51 పోస్టల్ బ్యాలెట్లను అధికారులు చెల్లుబాటు కావని నిర్ధారించారు. 

గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 25 మంది అభ్యర్థులు ఉన్నారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ బలపరచిన అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
Go Back to Shorts
Graduate MLC Elections
Counting
East Godavari-West Godavari

More Telugu News