టన్నుల కొద్దీ బంగారాన్ని స్టోర్ చేస్తున్న రిజర్వు బ్యాంకు.. ఎందుకో తెలుసా?
- 10 గ్రాములు రూ. 88 వేలు దాటేసిన బంగారం ధర
- గతేడాది 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన భారత్
- బంగారం నిల్వలు పెంచుకుంటున్న పలు దేశాలు
- అనుకోని సంక్షోభం ఏర్పడితే బయటపడే లక్ష్యంతో బంగారం నిల్వలు పెంచుకుంటున్న మోదీ ప్రభుత్వం
2024లో పోలాండ్ అత్యధికంగా 90 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. టర్కీ 75 టన్నులు, భారత్ 73 టన్నులు కొనుగోలు చేసి వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ దేశాలు తమ బంగారు నిల్వలను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక, భారతీయ రిజర్వు బ్యాంకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ నిల్వలు పెంచుకుంటోంది.
గతేడాది భారతీయ రిజర్వు బ్యాంకు 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. మన పొరుగు దేశం చైనాతో పోలిస్తే ఇది రెండింతలు. అయితే, ఆర్బీఐ పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ, నిల్వ చేస్తుండటం వెనక వ్యూహాత్మక కారణం ఉంది. అనుకోని సంక్షోభం ఏర్పడినప్పుడు దేశాన్ని బయటపడేసే మోదీ ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే ఈ కొనుగోళ్లు జరుపుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం గతేడాది నవంబర్లో ఆర్బీఐ అదనంగా మరో 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఆ నెలలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి.