ఎంపీ మాగుంటకు నేడు చెన్నై ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ

  • గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మాగుంట
  • బైపాస్ సర్జరీ నిర్వహించనున్న చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు
  • తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని కోరిన మాగుంట
ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలో, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఈరోజు ఆయనకు బైపాస్ సర్జరీ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని పార్టీ శ్రేణులను, అభిమానులను కోరారు.

ఈ మధ్య కొన్ని రోజుల క్రితం తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు తనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని మాగుంట తెలిపారు. ఆరోగ్య పరిస్థితి బాగా ఉండాలంటే హార్ట్‌ బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యుల బృందం సూచించారని చెప్పారు. దీంతో ఫిబ్రవరి 6వ తేదిన చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో బైపాస్‌ ఆపరేషన్‌ చేయాలని వైద్యుల బృందం నిర్ణయించారని తెలిపారు. 

ఎలాంటి ఇంబ్బందులు లేకుండా ఆపరేషన్‌ సక్రమంగా జరుగుతుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారని మాగుంట చెప్పారు. ఆపరేషన్ చేయించుకుంటే ప్రజలకు మరింత ఎక్కువ సేవలు చేయడానికి వీలుంటుందని వైద్యులు తెలిపారని, ఆరోగ్యరీత్యా ఆపరేషన్‌ చేయించుకోవాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో, భగవంతుని ఆశీర్వాదాలతో ఆపరేషన్‌ సక్రమంగా జరిగి... మీకు సేవలు కొనసాగించేందుకు, మెరుగుబడిన ఆరోగ్యంతో తక్కువ రోజుల్లోనే తాను ఒంగోలుకు వచ్చి అందరిని కలుసుకుంటానని చెప్పారు.


More Telugu News