జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరు... ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదు: చింతా మోహన్

జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబుకు నష్టమని... అందుకే జమిలికి ఆయన ఒప్పుకోరని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ఏపీలో మళ్లీ జగన్ బలపడే అవకాశమే లేదని అన్నారు. జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారని... ఇప్పుడు రెండో ఛాన్స్ అడిగినా... ప్రజలు జగన్ కు అవకాశం ఇవ్వరు అని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

A అంటే అమరావతి, P అంటే పోలవరం ప్రాజక్ట్ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. తిరుపతిలో పెట్టాల్సిన రాజధానిని విజయవాడలో పెడితే రాయలసీమ ఏం కావాలని ప్రశ్నించారు. ఒక్క చోటే రూ. 60 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని... ప్రతి జిల్లా అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు ఖర్చు పెట్టాలని సూచించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదని... రాయలసీమలో ఉపాధి అవకాశాలు కావాలని అన్నారు. తాను ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని... ఎస్సీ వర్గీకరణ చేస్తే టీడీపీ పతనం అవుతుందని చెప్పారు.


More Telugu News