ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో సమూల మార్పులపై దృష్టిసారించిన పవన్ కల్యాణ్

  • అటవీ శాఖలో సమూల మార్పులపై దృష్టి పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
  • అధికారులకు కీలక ఆదేశాలు 
  • శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై నివేదిక సిద్ధం చేయాలన్న పవన్  
గత ఆరు నెలలుగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై పూర్తి స్థాయిలో దృష్టి నిలిపి, గ్రామీణ పాలన, క్షేత్రస్థాయి పర్యటనలు, అభివృద్ధి, సంస్కరణలతో తనదైన ముద్ర వేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా తన పరిధిలోని అటవీశాఖలో సమగ్ర మార్పుల మీద దృష్టి సారించారు. రాష్ట్ర అటవీశాఖకు ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని శాఖ పి.సి.సి.ఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్‌లను ఆయన ఆదేశించారు.

గత కొన్నాళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతిని సాధించలేకపోయిందని ఆయన గుర్తించారు. సమర్థత కలిగిన నాయకత్వం అటవీ శాఖకు ఉన్నప్పటికీ సరైన ఫలితాలు సాధించలేకపోయిందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శాఖలో పూర్తిస్థాయి మార్పుచేర్పులతో మళ్లీ అటవీశాఖను రాష్ట్ర అవసరాల్లో, అభివృద్ధిలో ప్రాధాన్య స్థానంలో నిలిపేందుకు ప్రయత్నం మొదలుపెట్టారు. నూతనోత్తేజంతో, అద్భుత ప్రగతిలో అటవీ శాఖ పచ్చగా కళకళలాడాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో భూముల పరిరక్షణను తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారు. ముఖ్యంగా కడప అటవీ డివిజన్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ డివిజన్ పరిధిలో విలువైన భూములు, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే భూములను రక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.  

శేషాచలంలో లభ్యమయ్యే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంపై పకడ్బందీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి వేర్వేరు మార్గాల్లో ఇతర రాష్ట్రాల సరిహద్దుల ద్వారా అక్రమ రవాణా అవుతున్న ఎర్రచందనాన్ని అరికట్టాలని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని పోలీసులకు దొరుకుతున్న ఎర్రచందనాన్ని వారు అక్కడే వేలం వేస్తుండటంతో రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ .. రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అడవుల్లో దొరుకుతున్న నాణ్యమైన, మేలైన, అరుదుగా దొరికే అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని భావిస్తున్నారు. గిరిజనులను దీనిలో భాగం చేసి మార్కెటింగ్ చేయడం మీద తగిన మార్గం చూపాలని భావిస్తున్నారు. దానికి కార్పొరేట్ మార్కెట్ రంగంలో ఉన్నవారి సహకారం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన విధంగా రాష్ట్రం 50 శాతం పచ్చదనం అభివృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్లవచ్చని అధికారులకు పవన్ సూచించారు. 

అంతే కాకుండా వన్య ప్రాణుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. అడవుల్లో వేటను నిషేధించి, నిఘాను పెంపొందించడంతో పాటు గిరిజనులు సైతం అటవీ ప్రాణుల రక్షణ పట్ల చైతన్యం తీసుకురావడం ప్రధానమైన అంశంగా తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపు సమస్యపై సమీక్షించారు. కర్ణాటక ప్రభుత్వంతో మరోసారి మాట్లాడి కుంకీ ఏనుగులను త్వరితగతిన తీసుకురావాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

దేశం ఏటా రూ.22 వేల కోట్ల విలువైన కలప ఆధారిత దిగుమతులను చేసుకుంటున్న నేపథ్యంలో దాన్ని నివారించేందుకు అటవీ శాఖ ద్వారా దేశ అవసరాలకు తగిన కలప ఉత్పత్తులను తయారు చేసే దిశగా ఓ సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేయాలని పవన్ భావిస్తున్నారు. రాష్ట్రం నుంచి అధికంగా కలప ఉత్పత్తులు తయారు అయితే, దేశం దిగుమతి చేసుకునే ఉత్పత్తులను తయారు చేయగలిగితే అద్భుతాలు సాధించవచ్చని, 2047 నాటికి భారతదేశం కలప ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశకు చేరుకోవాలని కార్యాచరణ నివేదికను రూపొందించాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.


More Telugu News