డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దు: జనసేన కేంద్ర కార్యాలయం

  • కూటమిలో కలకలం రేపుతున్న డిప్యూటీ సీఎం అంశం
  • దీనిపై మాట్లాడొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన టీడీపీ హైకమాండ్
  • సోషల్ మీడియాలో కూడా స్పందించవద్దని జనసైనికులకు జనసేన ఆదేశం
డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో కలకలం రేపుతోంది. కూటమి ప్రభుత్వ పాలన ప్రశాంతంగా కొనసాగుతున్న తరుణంలో... నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఈ డిమాండ్ లేవనెత్తుతున్న టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో జనసేన నేతలు కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు కోరుకోవడంలో తప్పు లేదని... తమకు కూడా పవన్ ను సీఎంగా చూడాలని ఉందని వారు కౌంటర్ అటాక్ ఇచ్చారు. 

ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిన టీడీపీ హైకమాండ్ వివాదానికి ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకుంది. ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు ఇదే అంశంపై జనసేన కేంద్ర కార్యాలయం కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పడుతుందేమో వేచి చూడాలి.

Deputy CM
Janasena
Telugudesam

More Telugu News