గుడి కోనేరు కబ్జా చేస్తున్నారని పూజారి కంటతడి... వీడియో చూసి వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్

  • జగద్గిరిగుట్ట వేణుగోపాలస్వామి వారి గుండం కబ్జాకు గురవుతోందంటూ పూజారి వీడియో
  • భక్తులు, రాజకీయ నాయకులు దేవుడి భూములు కాపాడాలని కన్నీటి విజ్ఞప్తి
  • వీడియోను చూసి వాకబు చేసి... ఆలయ భూములను పరిశీలించిన హైడ్రా కమిషనర్
జగద్గిరిగుట్ట ప్రాంతంలోని గోవిందరాజస్వామి దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కాపాడాలంటూ ఆలయ పూజారి కన్నీళ్లు పెట్టుకొని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు జగద్గిరిగుట్ట ఆలయ భూముల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు హైడ్రా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది.

సదరు పూజారి వీడియోను ట్వీట్ కు జత చేస్తూ... హైడ్రా కమిషనర్ జగద్గిరిగుట్ట ప్రాంతంలో పర్యటించినట్లు తెలిపింది.

స్వామివారి గుండం కబ్జాకు గురవుతోందని, భక్తులు, రాజకీయ నాయకులు స్వామివారి భూములను కాపాడాలని పూజారి కన్నీళ్లు పెట్టుకుంటూ విజ్ఞప్తి చేశారు. పూజారి ఆవేదనను పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ తక్షణమే స్పందించారు.

పూజారి వీడియోను చూసి అక్కడి పరిస్థితిని వెంటనే వాకబు చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్... కబ్జాకు గురైన జగద్గిరిగుట్ట ఆలయ భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆలయ కోనేరు కబ్జాకు గురవుతోందంటూ ఆవేదన చెందిన పూజారి నరహరిని కూడా కలిశారు. కబ్జాకు గురవుతున్న భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూజారి అన్ని వివరాలను ఇచ్చారు.

జగద్గిరిగుట్ట ఆలయ సముదాయాల స్థలం 14.10 ఎకరాల వరకు ఉంటుందని, పర్కి చెరువు 66 ఎకరాలకు పైగా ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు పూజారి, స్థానికులు వివరించారు. త్వరలో సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించి ప్రభుత్వ, దేవాలయ భూములను కాపాడుతామని కమిషనర్ హామీ ఇచ్చారు.


More Telugu News