Rishabh Pant: చివరి టెస్టులో రిషబ్ పంత్‌పై వేటు?.. అతడి స్థానంలో బరిలోకి యువ వికెట్ కీపర్!

Report emerged suggesting that star wicket keeper Rishabh Pant may be axed from the 5th test
షార్ట్స్‌లో చూడండి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వెన్నునొప్పి కారణంగా పేసర్ ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడని కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది. చివరి టెస్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను పక్కన పెట్టే అవకాశం ఉందని, తుది జట్టు నుంచి అతడిని తొలగించవచ్చని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది.

పంత్ ప్రదర్శనను టీమ్ మేనేజ్‌మెంట్ కొంతకాలంగా గమనిస్తోంది. ముఖ్యంగా మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిర్లక్ష్యపూరితంగా వికెట్‌ను చేజార్చుకున్నాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో స్కూప్ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయిన పంత్‌పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్టుపిడ్’ అని తీవ్రంగా విమర్శించారు.

ప్రస్తుత సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడిన పంత్ ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. 20 లేదా 30కి పైగా పరుగుల రూపంలో చక్కటి ఆరంభాలను అందుకొని ఆ తర్వాత నిర్లక్ష్యపూరితంగా ఆడి ఔట్ అవుతున్నాడు. దీంతో ఆరంభాలను పెద్ద స్కోర్లగా మలచలేకపోయాడు. దీంతో, ఆఖరి టెస్టుకు పంత్‌ను తప్పించి రిజర్వ్ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్‌కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన ఇండియా-ఏ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జురెల్ 80, 68 స్కోర్‌లతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో అవకాశం ఇచ్ఛినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరి, చివరి టెస్టులో అవకాశం లభిస్తే ఎలా ఆడతాడో చూడాలి.
Go Back to Shorts
Rishabh Pant
Cricket
Sports News
Team India

More Telugu News