Manmohan Singh: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు... పాడె మోసిన రాహుల్ గాంధీ

Manmohan Singh last rites finished
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. మన్మోహన్ సింగ్ పాడెను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోశారు. 

అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కడ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్, త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. పలువురు విదేశీ ప్రముఖులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వీరిలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ చుక్ కూడా ఉన్నారు.

92 ఏళ్ల మన్మోహన్ సింగ్ మొన్న రాత్రి ఇంటివద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పదేళ్ల పాటు ప్రధానిగా దేశానికి సేవలందించిన మన్మోహన్... ఆర్బీఐ గవర్నర్ గా, పీవీ నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.
Manmohan Singh
Congress

More Telugu News