Manmohan Singh: మన్మోహన్ ఒక ఛాంపియన్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సంతాపం తెలిపారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఛాంపియన్‌లలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

భారత్-అమెరికా మధ్య కొత్త తరం సంబంధాలకు పునాది వేయడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో ఉందన్నారు. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో అమెరికా తరఫున భారత ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నామన్నారు. గత రెండు దశాబ్దాలలో మన రెండు దేశాలు కలిసి సాధించిన వాటికి పునాది వేసిన ఘనత మన్మోహన్ సింగ్‌దే అన్నారు. అమెరికా-భారత్ మధ్య పౌర అణు ఒప్పందం ముందుకు వెళ్లడంలో ఆయన కృషి ఉందన్నారు.

ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్‌ను భారతదేశ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత దృఢంగా కావడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఉందని, ఆయనను అమెరికా ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు.
Manmohan Singh
USA
India
Congress

More Telugu News