Ponguleti Srinivas Reddy: ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఈ నెల 31వ తేదీలోగా మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వస్తారని భావిస్తున్నానన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన నేతగా సభకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. మేడ్చల్, రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను త్వరలో విప్పుతామని హెచ్చరించారు.

లగచర్ల కేసులో అరెస్టై జైల్లో ఉన్న రైతును ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో బేడీలు వేయడం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు. అదానీ విషయంలో ఇక వివాదం వద్దని... ఆయన ఇచ్చిన రూ.100 కోట్లను తమ ప్రభుత్వం వెనక్కి ఇచ్చిందని స్పష్టం చేశారు. హాస్టళ్లకు పెండింగ్ బిల్లులను ఈ నెల 31వ తేదీ లోగా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.

అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకు రావాలి: పొన్నం

అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన అంశాలు చర్చకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రతి సభ్యుడు సభ విలువను కాపాడాలని, ప్రజాస్వామ్యయుతంగా చర్చకు రావాలన్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రజాప్రతినిధుల శిక్షణా తరగతులు ముగిశాయి.

అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ... ఈరోజుతో శిక్షణా తరగతులు ముగిశాయన్నారు. తెలంగాణ మూడో శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభా వ్యవహారాల శాఖ రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించిందన్నారు. శాసనసభ, మండలిలో సమర్థవంతంగా ప్రజల అంశాలు చర్చకు రావాలన్నారు.

ప్రజల కోసం ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అది నెరవేరే విధంగా సభ్యులంతా సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య విలువలకు శాసనసభ వేదిక అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 
Ponguleti Srinivas Reddy
Ponnam Prabhakar
Telangana
KCR

More Telugu News