kuwait: కువైట్‌ నుంచి వచ్చి మరీ ఓ వ్యక్తిని హత్య చేసి వెళ్లిపోయాడు!

man came from kuwait and killed
  • కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసిన తండ్రి
  • పోలీసులు సరిగా స్పందించకే ఇలా చేశానని చెప్పిన నిందితుడు ఆంజనేయ ప్రసాద్
  • సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన నిందితుడు
ఓ వ్యక్తి కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి చడీ చప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. తను హత్య చేసిన విషయం స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, ఎందుకు చేసిందీ వివరించడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఈ విషయం తీవ్ర సంచలనం అయింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి చట్టపరంగా న్యాయం జరగకపోవడంతో తాను హంతకుడనయ్యానని పేర్కొన్నాడు.

విషయంలోకి వెళితే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్‌లో ఉంటున్నారు. దీంతో వీరు తమ కుమార్తె (12)ను గ్రామంలో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకట రమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకట రమణ తండ్రి గుట్ట ఆంజనేయులు (దివ్యాంగుడు) మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. దీనిపై ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. దీంతో చంద్రకళ ఆందోళనతో కువైట్ నుండి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలివేశారు. దీంతో చంద్రకళ ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్‌కు చెప్పింది. అడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆంజనేయ ప్రసాద్ అవేదన చెందాడు. ఆగ్రహంతో కువైట్ నుంచి వచ్చి శనివారం వేకువజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. ఆ వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. అయితే ఈ విషయం తెలియక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే కువైట్ వెళ్లిన తర్వాత ఆంజనేయ ప్రసాద్ తానే ఆంజనేయులును హత్య చేసినట్లుగా సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనం అయింది. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని పేర్కొన్నాడు. చట్టప్రకారం న్యాయం జరగకే హత్య చేశానని చెప్పుకొచ్చాడు.      

More Telugu News

kuwait
killed
Crime News
annamaiah dist