రేవంత్ రెడ్డి ఆదేశాలతో పని చేస్తే ఆ తర్వాత ఇబ్బందిపడేది మీరే: పోలీసులకు హరీశ్ రావు హెచ్చరిక

Harish Rao warns Telangana Police
  • కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని భావించవద్దని సూచన
  • రేవంత్ రెడ్డి పాలన ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం
  • పోలీసులతో రాజ్యమేలే ప్రభుత్వం మనుగడ సాధించలేదని హెచ్చరిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు పని చేస్తే ఆ తర్వాత ఇబ్బందిపడేది వారేనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని భావించవద్దన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆయనను పోలీసులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెబుతున్న మార్పు... నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలేనని ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ఎఫ్ఐఆర్‌లు పోలీస్ స్టేషన్లలో కాకుండా గాంధీ భవన్‌లో తయారవుతున్నాయని ఆరోపించారు.

ఎవరి మీద ఏ సెక్షన్లు పెట్టాలి... ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వస్తున్నాయన్నారు. ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి పగబట్టినట్లుగా ఉందన్నారు. ఇది ప్రజాపాలన కాదు... రాక్షస పాలన అని మండిపడ్డారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా? అని నిలదీశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు... కానీ ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు.

ఏ నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారో అదే నిరుద్యోగుల వీపులను అశోక్ నగర్‌లో పగులగొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి గిరిజనులపై దాడి చేసి జైళ్లలో నిర్బంధించారన్నారు. రేవంత్ పాలన నాటి ఇందిరమ్మ హయాం నాటి ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ఇందిరమ్మ లాంటి వాళ్లను కూకటివేళ్లతో పెకిలించిన దేశం మనది అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులతో రాజ్యమేలితే ప్రభుత్వం మనుగడ సాధించలేదని హెచ్చరించారు.
Go Back to Shorts
Harish Rao
Telangana
Revanth Reddy

More Telugu News