Sports News: ఎస్‌బీఐ ఉద్యోగంలో చేరిన భారత మాజీ క్రికెటర్.. ఈ మధ్యే రిటైర్మెంట్

Ex cricketer Siddharth Kaul has started working for the State Bank of India
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ‘2008 అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌’ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. నేడు దిగ్గజ క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. అయితే కోహ్లీతో పాటు అండర్-19 వరల్డ్ కప్‌ గెలిచిన యువ భారత జట్టులో కీలక భాగస్వామిగా ఉన్న పంజాబ్ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ ఇటీవలే క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎస్‌బీఐ ఉద్యోగిగా కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించాడు.

కాగా సిద్ధార్థ్ కౌల్ 2018-19లో భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో వన్డే, టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ నవంబర్ 28న భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘‘నాకు ఒక మార్గాన్ని చూపించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిరంతరాయంగా మద్దతు ఇచ్చిన అభిమానులు, ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా గాయాలు, కెరీర్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో అండగా నిలిచి నాలో విశ్వాసాన్ని పెంచారు. డ్రెస్సింగ్ రూమ్ జ్ఞాపకాలు అందించిన సహచరులతో పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే నా కలను నిజం చేసిన బీసీసీఐకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2008 అండర్-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో భాగస్వామిగా ఉండడానికి, 2018లో నేను టీ20, వన్డే ఫార్మాట్‌లలో అరంగేట్రం చేయడానికి అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. మరో ట్వీట్‌లో ‘ఆఫీస్ టైమ్’ అని రాసుకొచ్చారు. కారులో ఆఫీస్‌కు వెళుతున్న ఫొటోని కూడా షేర్ చేశాడు.

కాగా సిద్ధార్థ్ కౌల్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో యువ భారత జట్టు అండర్ 19 వరల్డ్ గెలవడంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో పాటు సిద్ధార్థ్ కౌల్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పంజాబ్ తరపున మొత్తం 88 మ్యాచ్‌లు ఆడి 297 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో 87 మ్యాచ్‌లు 120 వికెట్లు తీశాడు.
Go Back to Shorts
Sports News
Siddharth Kaul
sbi
Cricket

More Telugu News