నన్ను వేధించిన అధికారులకే పోస్టింగ్ ఇస్తున్నారు: చింతమనేని ప్రభాకర్ ఆవేదన

  • తనను వేధించిన వారు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకంటున్నారని వ్యాఖ్య
  • ఆ నాయకులే కావాలంటూ మా నాయకులే పోస్టింగ్‌లు ఇస్తున్నారని ఆవేదన
  • వైసీపీ హయాంలో తనపై 27 అక్రమ కేసులు పెట్టారన్న చింతమనేని
వైసీపీ హయాంలో తనను వేధించిన అధికారులకు ఇప్పుడు మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. తనను వేధించిన అధికారులు కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారన్నారు.

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తనపై 27 అక్రమ కేసులు పెట్టిందని, ఇందులో రెండింటిని కోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, తనతో పాటు ఈ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని తెలిపారు.

తనపై వైసీపీ ప్రభుత్వం 14 అక్రమ కేసులు పెట్టిందని ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. వైసీపీ హయాంలో పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన విజయవంతమైనందుకు కూడా కేసులు పెట్టారన్నారు.

Chinthamaneni Prabhakar
Andhra Pradesh
Telugudesam

More Telugu News