మాజీ సీఎం జగన్‌ను కలిసిన ఇంటూరి రవికిరణ్‌ భార్య సుజన

  • తన భర్తను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపించిన సుజన
  • వేర్వేరు చోట్ల మొత్తం 9 కేసులు పెట్టారని జగన్‌తో చెప్పుకున్న కిరణ్ భార్య
  • రాజమహేంద్రవరం సీఐ తన భర్త పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ
గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ భార్య సుజన నిన్న (మంగళవారం) మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని ఆయన కార్యాలయానికి వెళ్లి ఆమె మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ పోలీసులు తన భర్తను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను ఎక్కడికి తరలిస్తున్నారో కూడా చెప్పడం లేదని అన్నారు. గుడివాడ, అరండల్‌పేట, విశాఖపట్నంలో తన భర్తపై మొత్తం 9 కేసులు పెట్టారని సుజన తెలిపారు.

రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్ సీఐ తన భర్త ఇంటూరి కిరణ్ పట్ల దారుణంగా వ్యవహరించారని మీడియాతో సుజన అన్నారు. జగన్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకు అండగా ఉంటానని జగనన్న ధైర్యం చెప్పారని ఆమె అన్నారు. తన భర్తకు ఒక కేసులో స్టేషన్‌ బెయిల్‌ వస్తే మరో కేసులో పోలీసులు తీసుకెళుతున్నారని పేర్కొన్నారు. హత్య చేసిన వ్యక్తితో ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. స్టేషన్ బెయిల్ వచ్చి బయటకు వచ్చిన వెంటనే ఇంకో స్టేషన్ పోలీసులు సిద్ధంగా ఉంటున్నారని ఆమె అన్నారు. ఎక్కడికి తీసుకెళుతున్నారు? ఏ కేసులో తీసుకెళుతున్నారు? అని ప్రశ్నించినా చెప్పడం లేదని సుజన పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని అన్నారు. 


More Telugu News

Inturi Ravikiran YSRCP YS Jagan Andhra Pradesh