కేటీఆర్ పాప్యులారిటీ చూసి రేవంత్ రెడ్డి అసూయతో రగిలిపోతున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS MLAs fires on Congress govt
  • కేటీఆర్ బావమరిది ఫాంహౌస్ పై పోలీసుల దాడులు
  • విల్లాలో తనిఖీలకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది యత్నం
  • కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై పోలీసులు దాడులు, ఎక్సైజ్ శాఖ తనిఖీలకు యత్నించిన నేపథ్యంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కేటీఆర్ ను తప్పుడు కేసులో ఇరికించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫాంహౌస్ లో నిర్వహించిన పార్టీలో కేటీఆర్ భార్య శైలిమ కూడా ఉన్నారన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, డాక్టర్ కె.సంజయ్, జి.శ్రీనివాస్ యాదవ్, సతీశ్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. 

కేటీఆర్ ను అప్రదిష్ఠపాల్జేసేందుకు యత్నిస్తున్నారని, ఆయనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో కేటీఆర్ కు ఉన్న పాప్యులారిటీని అధికార కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. ఓవైపు కేటీఆర్ కు ప్రజాదరణ అంతకంతకు పెరుగుతుండడం, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుండడం కాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడడంలేదని పేర్కొన్నారు. 

అంతేకాకుండా, రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ పట్ల అసూయతో రగిలిపోతున్నారని, అందుకే ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేటీఆర్ ఫోబియాతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
KTR
Revanth Reddy
Raj Pakala
BRS
Congress
Hyderabad
Telangana

More Telugu News