కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్: తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన ఈటల రాజేందర్

Etala Rajendar fires at congress party
  • సీఎంలను మార్చాలనుకున్నప్పుడు మతకల్లోలాలు సృష్టించిన పార్టీ అని ఆరోపణ
  • సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహిస్తే దుండగులు చేరారన్న ఈటల
  • కాషాయ పార్టీ ఎప్పుడూ ప్రజల రక్షణ, శాంతిని కాంక్షిస్తుందన్న రాజేందర్
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీది చాలా నీచమైన కల్చర్ అని, పార్టీలో ముఖ్యమంత్రులను మార్చాలని భావించినప్పుడు కూడా మతకల్లోలాలు సృష్టించిన పార్టీ అని ఆరోపించారు. 1978లో చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ మంటల్లో మాడిపోయి... ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. చెన్నారెడ్డిని గద్దె దింపాలని ఈ మతకల్లోలాలు సృష్టించారన్నారు. 1982, 1983లోనూ ఇలాంటి ఘర్షణలకు కాంగ్రెస్ కారణమైందన్నారు.

ర్యాలీలోకి దుండగులు ప్రవేశించారు

ఇటీవల సికింద్రాబాద్‌లో తాము ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించామని, బీజేపీ కార్యకర్తల ముసుగులో కొందరు దుండగులు తమ ర్యాలీలో చేరి రాళ్లు, చెప్పులు విసిరారని మండిపడ్డారు. పారిపోతున్న వారిని పట్టుకొని మరీ పోలీసులు చితకబాదినట్లు వెల్లడించారు. కాషాయ పార్టీ ఎప్పుడూ ప్రజల రక్షణ, శాంతిని మాత్రమే కాంక్షిస్తుందన్నారు. తమ పార్టీలో ప్రతీకారం అనేది ఉండదన్నారు.

కాంగ్రెస్ పార్టీ పేరుకే లౌకికవాదమని, కానీ మతోన్మాదులను ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో ఎన్నో సందర్భాలలో బాంబులు పేలాయని ఆరోపించారు. ఈ పేలుళ్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోందన్నారు.
Go Back to Shorts
Congress
Etela Rajender
BJP

More Telugu News