రోజా వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్
- కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి వాళ్లు ఓర్వలేకపోతున్నారన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
- గంజాయి రవాణాను ప్రోత్సహించి యువత జీవితాలను బలి చేశారని విమర్శ
- రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటుకే పరిమితం కావడం ఖాయమని చిన్ని జోస్యం
గత ఐదేళ్ల కాలంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, అయినా వైసీపీ నేతలకు అవేమీ పట్టలేదన్నారు. తమ ప్రభుత్వం వారి ఆచూకీ గుర్తించి వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్లు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలో పెద్దలను కలిసి నిధులు తెస్తున్నారని వివరించారు. రాష్ట్రాన్ని గత ఐదేళ్లుగా సర్వ నాశనం చేశారని, గంజాయి రవాణాను ప్రోత్సహించి యువత జీవితాలను బలి చేశారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన దారుణాలకు ఈ గంజాయి మత్తే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. దారుణాలకు పాల్పడిన నిందితులను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తోందని చెప్పారు.
జగన్ హయాంలో జరిగిన దారుణాలకు ఎంత మందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అందులో భాగంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి జత్వానీ కేసు విషయంలో ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. విశాఖలోని శారదా పీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన వందల కోట్ల విలువైన భూ కేటాయింపును సైతం ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జగన్ సర్కార్లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తూ ముందుకు వెళుతుంటే జగన్ అండ్ కో తట్టుకోలేకపోతుందని చిన్ని విమర్శించారు.