పవన్ కల్యాణ్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: కేఏ పాల్

ఏపీ డిప్యూటీ సీఎం పదవి నుంచి పవన్ కల్యాణ్ ను తొలగించాలని... లేనిపక్షంలో ఆయనే స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి వైదొలగాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. లక్ష కల్తీ లడ్డూలను అయోధ్యకు పంపించారని పవన్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను సినిమాల్లో మాదిరి చదువుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూ విషయంలో 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ మాట్లాడారని అన్నారు. 

పవన్ పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్ లో కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవన్ పై ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సీబీఐ విచారణ జరపాలని కోరారు. పవన్ పై తాను 14 సెక్షన్ల కింద పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఆర్టికల్ 8 ప్రకారం ఆయనను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని అన్నారు.


More Telugu News