Revanth Reddy: రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందించిన నిర్మాత యార్లగడ్డ సుప్రియ

తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదల నేపథ్యంలో ఖమ్మం, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాత, నటి యార్లగడ్డ సుప్రియ తెలంగాణలోని వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. 

అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున సుప్రియ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నందుకు ముఖ్యమంత్రి ఆమెను అభినందించారు.

వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మైత్రా ఎనర్జీ గ్రూప్ ఎండీ విక్రమ్ కైలాస్, అక్షత్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవి కైలాస్ రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రికి అందించారు.

లలితా జ్యువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ కూడా ముఖ్యమంత్రిని కలిసి రూ.1 కోటి రూపాయల చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం... వారిని అభినందించారు.
Revanth Reddy
Telangana
Yarlagadda Supriya
Floods

More Telugu News