‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ తొలగించి క్షమాపణ చెప్పు.. కంగనకు ఎస్‌జీపీసీ వార్నింగ్

  • సినిమాలో సిక్కులను అవమానించేలా సీన్లు ఉన్నాయని ఎస్‌జీపీసీ ఆరోపణ
  • కంగన, సినీ నిర్మాతలకు లీగల్ నోటీసులు
  • సినిమాపై నిషేధం విధించాలని సెన్సార్ బోర్డు, కేంద్ర సమాచార మంత్రిత్వశాఖకు లేఖలు
బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగన రనౌత్‌కు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) మరోమారు వార్నింగ్ ఇచ్చింది. కంగన ప్రధాన పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వివాదాస్పదమైంది. ఈ ట్రైలర్‌లో సిక్కు వ్యతిరేక సీన్లు ఉన్నాయని, ఇవి సిక్కు సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని ఎస్‌జీపీసీ ఆరోపించింది. 

ఆ ట్రైలర్‌ను తొలగించడంతోపాటు క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమర్జెన్సీ సినిమా నిర్మాతలతోపాటు కంగనకు లీగల్ నోటీసులు పంపింది. ఈ మూవీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖతోపాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్‌కు ఎస్‌జీపీసీ కార్యదర్శి ప్రతాప్ సింగ్ లేఖ రాశారు. 

సెప్టెంబర్ 6న ఎమర్జెన్సీ మూవీ థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై పంజాబ్ హైకోర్టులో సిక్కులు పిటిషన్ దాఖలు చేశారు. సిక్కులను అవమానించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అందులో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Emergency Movie
Kangana Ranaut
Bollywood
SGPC

More Telugu News