Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌పై అనర్హత... సాయంత్రం ఐదున్నరకు ఆర్బిట్రేషన్ కోర్టులో విచారణ

భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హతపై సాయంత్రం 5.30 గంటలకు కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ (సీఏఎస్) విచారణ జరపనుంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ సీఏఎస్‌ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ విచారణ సాయంత్రం ఐదున్నరకు వాయిదా పడింది.

సాయంత్రం 5.30 గంటలకు సీఏఎస్ దీనిని విచారించనుంది. వినేశ్ ఫొగాట్ తరఫున వాదనలు వినిపించేందుకు భారత ఒలింపిక్ సంఘం... ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియాను నియమించింది. వీరితో పాటు ఫ్రెంచ్ న్యాయవాదుల బృందం కూడా వాదనలు వినిపించనుంది.

రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 50 కిలోల విభాగంలో అదనపు బరువు కారణంగా వినేశ్ ఫొగాట్ ఫైనల్లో అనర్హతకు గురయ్యారు. అయితే ఫైనల్ వరకు వచ్చిన తనకు రజతం ఇవ్వాలని ఫొగాట్ కోరారు. అయితే ఒలింపిక్స్‌లో నిబంధనలను మార్చే అవకాశం లేదని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ స్పష్టం చేసింది. అయితే ఆర్బిట్రేషన్ అనుమతిస్తే ఫొగాట్‌కు రజతం దక్కే అవకాశాలు లేకపోలేదు. సీఏఎస్ తీర్పు కోసం యావత్ భారత్‌తో పాటు ప్రపంచ క్రీడాభిమానులు ఎదురు చూస్తున్నారు.
Vinesh Phogat
Sports News
Paris Olympics

More Telugu News