Mohammad Shami: ఐపీఎల్‌ లో హార్దిక్ పాండ్యా తనపై కోప్పడడం పట్ల మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు

వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత చీలమండ గాయం కారణంగా క్రికెట్‌కు దూరమై... శస్త్రచికిత్స చేయించుకున్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పాపులర్ యూట్యూబర్ శుభంకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ సీజన్-2022లో తాను ఓ క్యాచ్ పట్టడంలో విఫలం కాగా, నాటి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తనపై కోప్పడడం పట్ల షమీ స్పందించాడు.

‘‘నేను సాధారణంగా ఇలాంటి ఘటనల విషయంలో స్పందించను. కానీ మరీ ఇబ్బంది పెట్టే విషయాలైతే మాట్లాడతాను. పాండ్యాకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరం స్నేహితులం. అయితే మ్యాచ్ ఆడుతున్న సమయంలో అవేమీ గుర్తురావు. ఆ విషయం ఇద్దరికీ తెలుసు. దాదాపు 10 ఏళ్లుగా ఒకరికొకరం తెలుసు. క్యాచ్ విషయంలో నేను ఏమన్నానో కూడా నాకు గుర్తులేదు... ప్రమాణం చేసి చెబుతున్నా అని పాండ్యా నాతో చెప్పాడు. అయితే కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీలలో మమ్మల్ని చూస్తుంటారు. కాబట్టి అలాంటి భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి” అని షమీ పేర్కొన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్‌లో షమీ, పాండ్యా ఇద్దరూ గుజరాత్ టైటాన్స్‌కు ఆడగా.. ఒక మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో షమీ క్యాచ్ పట్టకపోవడంతో పాండ్యా ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు వికెట్ అవసరమైన కీలక దశలో థర్డ్ మ్యాన్‌ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న షమీ క్యాచ్‌ను ఒడిసిపట్టకపోవడమే పాండ్యా కోపానికి కారణమైంది. దీంతో పాండ్యా ఒక్కసారిగా షమీపై కోపంతో అరిచాడు. సరిగ్గా ప్రయత్నించలేదనే ఉద్దేశంతో అసహనం వ్యక్తం చేశాడు.
Mohammad Shami
Hardik Pandya
Cricket
ipl
ipl 2022

More Telugu News