యూపీ బీజేపీలో లుకలుకలు.. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు
- లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత యోగి, మౌర్య మధ్య విభేదాలు
- పార్టీ కంటే ప్రభుత్వం, వ్యక్తులు గొప్పవారు కాదంటూ మౌర్య పోస్ట్
- పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో ఢిల్లీలో ఒంటరిగా సమావేశం
- విభేదాలు పరిష్కరించాలని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరికి నడ్డా సూచన
మౌర్య మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఒంటరిగా భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘోర వైఫల్యంతోపాటు త్వరలో రాష్ట్రంలో జరగనున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై చర్చించినట్టు తెలిసింది. అలాగే, యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా నడ్డాతో సమావేశమయ్యారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఆయనకు నడ్డా సూచించినట్టు తెలిసింది.
ఉప ఎన్నికల ఫలితాల తర్వాత యూపీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, తాజా పరిణామాలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ అంతర్గత కలహాలతో బీజేపీ మునిగిపోతుందని పేర్కొన్నారు.