నిరుద్యోగుల ధర్నా ఫొటోలు షేర్ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Asks Revanth Reddy Govt To Solve The Unemployment Youth Problems
  • రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన ‘మొహబ్బత్ కీ దుకాన్’ ఇదేనా అంటూ ప్రశ్న
  • గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ హైదరాబాద్ లో నిరుద్యోగుల ధర్నా
  • నిరుద్యోగులతో సామరస్యపూర్వకంగా చర్చించాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ తెలంగాణ నిరుద్యోగులకు మద్ధతు పలికారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలన్న డిమాండ్ కు అనుకూలంగా మాట్లాడారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన ‘మొహబ్బత్ కీ దుకాణ్' ఇదేనా అంటూ నిలదీశారు. వెంటనే నిరుద్యోగులతో సామరస్యపూర్వకంగా చర్చించి, వారి ఆందోళనను విరమింప చేయాలని రేవంత్ రెడ్డి సర్కారును డిమాండ్ చేశారు.

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు శనివారం రాత్రి చిక్కడ్ పల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపై ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద బైఠాయించారు. ఈ ధర్నాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బండి సంజయ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఇదే అశోక్ నగర్ లో గత ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పలు హామీలు ఇచ్చారు. ఆయన నిరుద్యోగ యువతకు ఇచ్చిన ‘‘మొహబ్బత్ కీ దుకాన్’’ ఇదేనా?’ అంటూ ప్రశ్నించారు.

నిరసనలను అణచివేయాలని చూడకుండా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వారి మనోవేదనను తొలగించాలని కోరారు. పరీక్షల షెడ్యూలింగ్, పోస్టుల పెంపు, ఉద్యోగాల క్యాలెండర్‌కు సంబంధించిన సమస్యలకు సానుకూల పరిష్కారం వెతకాలని సూచించారు. ఈమేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
Revanth Reddy
Congress
Rahul Gandhi

More Telugu News