ఏపీలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురి మృతి

  • అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో కారుని ఢీకొన్న వాహనం
  • ఈ ప్రమాదంలో నలుగురి మృత్యువాత
  • చిత్తూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల రోడ్లు రక్తమోడాయి. శనివారం వెలుగుచూసిన ఈ ప్రమాదాలు పలువురి ప్రాణాలను బలిగొన్నాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని కొండవాండ్లపల్లి వద్ద ఓ కారుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉండగా.. తీవ్ర గాయాలపాలైన మరొకరి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా మృతదేహాలను సమీపంలోని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు వెల్లడించారు.

ఇక చిత్తూరు జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపంజాణి మండలం బసవరాజు కండ్రిగ వద్ద టూరిస్టు బస్సు బోల్తాపడింది. బస్సు అనంతపురం నుంచి తమిళనాడుకు వెళ్తుండగా జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో 10 మంది టూరిస్టులు గాయపడ్డారు. చనిపోయినవారు సత్యసాయి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Road Accident
Andhra Pradesh
Annamayya District
Chittoor District

More Telugu News