G. Kishan Reddy: పంచెకట్టుతో లోక్ సభకు హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

- తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వచ్చిన కిషన్ రెడ్డి
- సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులు, మద్దతుతో ఎంపీగా ప్రమాణం చేశానన్న కేంద్రమంత్రి
- తెలంగాణ, సికింద్రాబాద్ ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని వెల్లడి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో తొలిరోజు సభకు హాజరయ్యారు. 18వ లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు.
ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులు, మద్దతుతో తాను 18వ లోక్ సభలో సభ్యుడిగా ప్రమాణం చేశానని పేర్కొన్నారు. భారతదేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, బీజేపీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్, తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో, అవిశ్రాంతంగా పని చేస్తానని... ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం చేస్తానన్నారు.