Mandipalli Ramprasad Reddy: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం... అతి త్వరలో ప్రారంభిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఏపీలో టీడీపీ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది  ప్రధానమైనది. దీనిపై రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అతి త్వరలోనే ప్రారంభిస్తామని, దీనిపై ప్రకటన ఉంటుందని తెలిపారు. పారదర్శక రీతిలో, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎవరికీ కష్టం కలగకుండా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. 

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్నారని, అయితే అక్కడ తలెత్తిన లోటుపాట్లు ఏపీలో చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ, ఏపీఎస్ఆర్టీసీ చర్యలు  తీసుకోవడం జరుగుతుందని మంత్రి వివరించారు. 

ఇక, మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. తాను చేపట్టిన శాఖలో తప్పులు జరగకుండా చూసేందుకు శక్తిమేర కృషి చేస్తానని చెప్పారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Mandipalli Ramprasad Reddy
AP Transport Minister
Free Journey
Women
RTC Buses
Andhra Pradesh
TDP

More Telugu News