Narendra Modi: ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

ఇటలీ పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీలో జీ7 దేశాల అవుట్ రీచ్ సదస్సుకు హాజరైన మోదీ... వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మొత్తమ్మీద మోదీ ఇటలీ పర్యటన విజయవంతమైందనే చెప్పాలి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తదితరులతో మోదీ అనేక అంశాలపై చర్చలు జరిపారు. 

దేశంలో ఎన్డీయే కూటమి మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ చేపట్టిన మొదటి విదేశీ పర్యటన ఇదే. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీని ప్రపంచ దేశాల నేతలు అభినందించారు.

ఇటలీ పర్యటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ... జీ7 సదస్సు కేంద్రబిందువుగా సాగిన ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా జరిగిందని వివరించారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించే దిశగా నేతలందరూ ప్రతిన బూనారని వివరించారు. ఘనమైన ఆతిథ్యం అందించిన ఇటలీ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
Narendra Modi
Italy
G7 Summit
New Delhi
India

More Telugu News