Palla Srinivas Rao: టీడీపీ ఏపీ కొత్త అధ్యక్షుడిగా ప‌ల్లా శ్రీనివాస‌రావు?

ఏపీ టీడీపీ కొత్త‌ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్‌రావును అధిష్ఠానం నిర్ణయించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఒకటి , రెండు రోజుల్లో జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు.. పల్లా శ్రీనివాస్‌ నియామకాన్ని ప్రకటించనున్నారని స‌మాచారం. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడుకు చంద్రబాబు కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు ద‌క్కాయి. దీంతో ఆయన టీడీపీ వ్యవహారాలపై పూర్తిస్ధాయిలో ఫోకస్ పెట్టే అవకాశం లేదు. 

ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు స్ధానంలో మరో సీనియర్ నేతకు ఏపీ పగ్గాలు అప్పగించేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు స‌మాచారం. ఇందులో భాగంగా గాజువాక నుంచి గెలిచిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావు పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పల్లా శ్రీనివాస్‌ గెలుపొందారు. వైసీపీ అభ్య‌ర్థి గుడివాడ అమ‌ర్‌నాథ్‌పై ఆయ‌న ఏకంగా 95, 235 ఓట్లతో మెజారిటీతో గెలిచారు.

దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్ధానంలో పల్లాకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని కూడా చెబుతున్నారు. త్వరలో పల్లా శ్రీనివాసరావు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Palla Srinivas Rao
TDP
Andhra Pradesh
Chandrababu

More Telugu News