ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది: పవన్ కల్యాణ్

  • సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
  • ఎన్నికల హామీల ఫైళ్లపై సంతకాలు
  • ఏపీకి పునర్ వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయన్న పవన్
సీఎం చంద్రబాబు ఇవాళ బాధ్యతలు చేపడుతూ, ఎన్నికల హామీల ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని, రాష్ట్ర మంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని తెలిపారు.

16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేశారని... ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారని పేర్కొన్నారు. 

సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేశారని, ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం... యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు నైపుణ్య గణన ఫైలుపై అయిదో సంతకం చేశారని పవన్ కల్యాణ్ వివరించారు. 

సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు పునర్ వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని స్పష్టం చేశారు.


More Telugu News

Pawan Kalyan Chandrababu Poll Assurances Janasena TDP-JanaSena-BJP Alliance