సుప్రీం కోర్టులో అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు!

మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బెయిల్ పొడిగింపు పిటిషన్ పై తక్షణ విచారణ కోరుతూ ఆయన తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్‌ ముందుకు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు రిజర్వ్ లో ఉన్నందున పిటిషన్‌ లిస్టింగ్ పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ 1 వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. 

అయితే, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేర తగ్గిందన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్ స్కాన్ సహా పలు ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగా బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. మే 10 న ఆయన తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.

Arvind Kejriwal
AAP
Supreme Court
BJP
Delhi Liquor Scam

More Telugu News