తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై సీఎస్ శాంతికుమారి సమీక్ష

  • జూన్ 2న రాత్రి ట్యాంక్‌బండ్‌పై బాణసంచా, లేజర్ షో నిర్వహించనున్నట్లు వెల్లడి
  • పరేడ్ మైదానంలో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్న సీఎం
  • ట్యాంక్‌బండ్‌పై స్వయం సహాయక బృందాల స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, వినోదశాలల ఏర్పాటు
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. జూన్ 2న రాత్రి ట్యాంక్‌బండ్‌పై బాణసంచా, లేజర్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. అత్యంత వైభవంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలన్నారు. జూన్ 2న గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పిస్తారన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సీఎం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారన్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై కళారూపాల కార్నివాల్ ఉంటుందన్నారు.

5 వేల మంది పోలీసుల బ్యాండ్ ప్రదర్శన ఉంటుందన్నారు. ట్యాంక్‌బండ్‌పై హస్తకళల, చేనేత కళల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జూన్ 2న ట్యాంక్‌బండ్‌పై స్వయం సహాయక బృందాల స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలోని ప్రముఖ ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.

Telangana
CS Shanthi Kumari
Telangana Formation Day

More Telugu News