Harish Rao: ఆరు నెలల్లో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది... గ్యారెంటీలపై చేతులెత్తేశారు: హరీశ్ రావు

Harish Rao blames congress over six guarantees
  • మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు... ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపాటు
  • ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని గుర్తు చేసిన మాజీ మంత్రి
  • టిమ్స్‌పై మంత్రి కోమటిరెడ్డి విషం చిమ్ముతున్నారని ఆగ్రహం

ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం బయటపడిందని... ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను నమ్మించి చేతులెత్తేశారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు... ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారని గుర్తు చేశారు. 

టిమ్స్‌పై కోమటిరెడ్డి విషం చిమ్ముతున్నారు

బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన టిమ్స్ ఆసుపత్రులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్ముతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. జనాభా అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని తాము అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించామన్నారు. కానీ ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికొదిలేసిందని ఆరోపించారు. ఆర్ అండ్ బీ మంత్రికి టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన లేదని విమర్శించారు. ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 

అదే నిజమైతే రెండేళ్ల క్రితం నాటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్మించిన 24 అంతస్తుల ఆసుపత్రి కనిపించలేదా? అని నిలదీశారు. కేజ్రీవాల్ ఢిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు చూడటం లేదు? అని ప్రశ్నించారు. పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలను పెంచాలన్నారు.

  • Loading...

More Telugu News