Medigadda Barrage: 16వ గేటు ఎత్తే సమయంలో శబ్ధాలు, ప్రకంపనలు... మేడిగడ్డ బ్యారేజీ కింద భారీ అగాధం?

More Problems Tumble Out of Medigadda
  • 16వ గేటు ఎత్తే ప్రయత్నం చేయగా భూగర్భం నుంచి శబ్దాలు
  • మరమ్మతులు నిలిపివేసిన అధికారులు
  • పనులు కొనసాగిస్తే బ్యారేజీ మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశముందని ఆందోళన
  • జియో ఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు

మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాకశీర్షికల్లో ఉంటోన్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు 7వ బ్లాక్‌లోని 15వ గేటును ఇటీవల ఎత్తారు. తాజాగా, 16వ నెంబర్ గేటు ఎత్తబోతే భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయి. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సార్లు కూడా శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో మరమ్మతు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యారేజీ కింద భారీ గొయ్యి ఏర్పడినట్లుగా అనుమానిస్తున్నారు.

జియో ఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. ఇలాగే మరమ్మతులు కొనసాగిస్తే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ అగాధం సైజ్ 12000 క్యూబిక్ మీటర్ల నుంచి 15000 క్యూబిక్ మీటర్ల వరకు ఉండవచ్చునని ఇటీవల నిర్వహించిన గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ టెస్ట్ ఆధారంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ అగాథం ఒకేచోట కాకుండా బ్యారేజీ పొడువునా కొన్నిచోట్ల పెద్దగా... కొన్నిచోట్ల చిన్నగా ఉంటుందని భావిస్తున్నారు. అగాధం లేదా గొయ్యి ఏర్పడిన ఏడో బ్లాక్‌లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయాయి.

భారీ గేట్లు బరువు అధికంగా ఉంటాయి. ఈ భారీ గేటును పైకి ఎత్తే సమయంలో పునాదులపై ఒత్తిడి పెరిగి... బ్యారేజీ మరింత లోతుకు కుంగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే కింద ఉన్న అగాధాన్ని పూడ్చిన తర్వాతే గేట్లను ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. గత ఏడాది అక్టోబర్ 21న ఏడో నెంబర్ బ్లాక్ కుంగిన తర్వాత అక్కడి లీకేజీని ఆపడానికి 40వేల ఇసుక బస్తాలను ఖాళీలలో వేశారు. ఇప్పుడు భారీ బొరియ ఉందని గుర్తించడం గమనార్హం.

మేడిగడ్డ బ్యారేజీలో 8 బ్లాకులు... 85 గేట్లు ఉన్నాయి. గత ఏడాది ఏడో బ్లాక్ కుంగిన వెంటనే 77 గేట్లు ఎత్తి బ్యారేజీలోని నీటిని దిగువకు వదిలారు. ఏడో బ్లాకు కుంగిపోవడంతో 15వ నెంబర్ నుంచి 22 నెంబర్ వరకు గేట్లు మొరాయించాయి. అప్పుడు ఈ గేట్లను ఎత్తలేదు.

కేంద్ర జల వనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ ఇటీవల కాళేశ్వరంపై సమర్పించిన మధ్యంతర నివేదికలో వర్షాకాలానికి ముందు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతుల గురించి తెలిపింది. మొరాయించిన గేట్లను వర్షాకాలానికి ముందే పైకెత్తాలని సూచించింది. ఏడో బ్లాకులోని రెండు పియర్లకు పగుళ్లు ఏర్పడి ఉండడంతో 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా ఎత్తాలని సూచించింది. గేట్లను ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడకుండా ఇతర గేట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేసి, ఎత్తాలని సూచించింది. నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 17న 15వ నెంబర్ గేటును ఎత్తారు. 16వ నంబర్ గేటు ఎత్తబోతే శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. పరీక్షల అనంతరం గొయ్యిపై స్పష్టత వచ్చాక ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడుస్తారు.

  • Loading...

More Telugu News