తెలంగాణ క్యాబినెట్ భేటీకి ఎట్టకేలకు అనుమతినిచ్చిన ఈసీ... కానీ...!

EC gives nod to Telangana cabinet meeting
  • ఈసీ అనుమతి రాకపోవడంతో నిన్న వాయిదా పడిన క్యాబినెట్ భేటీ
  • నేడు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ
  • జూన్ 4 లోపు చేయాల్సిన అంశాలపైనే చర్చించాలని స్పష్టీకరణ 
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిన్న సాయంత్రం జరగాల్సి ఉండగా, ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. అయితే, ఎట్టకేలకు ఈసీ నుంచి ఇవాళ అనుమతి రావడంతో రాష్ట్ర క్యాబినెట్ భేటీకి మార్గం సుగమమైంది. 

ఈసీ నుంచి అనుమతి రాకపోతే, మంత్రి వర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఆ అవసరం లేకుండానే కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. 

అయితే, తెలంగాణ క్యాబినెట్ భేటీకి కొన్ని షరతులు విధించింది. జూన్ 4వ తేదీ లోపు నిర్వర్తించాల్సిన అత్యవసర పనులపై మాత్రమే ఈ సమావేశంలో చర్చించాలని ఈసీ స్పష్టం చేసింది. ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి విషయాలను ఈ సమావేశంలో చర్చించరాదని తేల్చిచెప్పింది. 

ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, తెలంగాణ మంత్రి వర్గ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Telangana Cabinet
EC
Revanth Reddy
Congress
Telangana

More Telugu News