India: ఆంక్షల ముప్పు.. భారత్, ఇరాన్ ఒప్పందంపై స్పందించిన అమెరికా

After India and Iran Sign Port Deal US Warns Of Potential Risk Of Sanctions
  • ఇరాన్‌ తో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు తప్పదన్న అమెరికా 
  • చబహార్ పోర్టుపై భారత్, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం
  • పదేళ్లపాటు నిర్వహించనున్న భారత్
ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే ఏ దేశానికైనా ఆంక్షల ముప్పు పొంచివున్నట్టేనని అమెరికా హెచ్చరించింది. ఇరాన్‌లోని చబహార్ పోర్టుకు సంబంధించి ఇరాన్‌, భారత్‌ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చబహార్ పోర్టుకు సంబంధించి ఇరాన్, భారత్ మధ్య ఒప్పందం కుదిరిందని పేర్కొంటున్న కథనాలపై తమకు అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. 

చబహార్ పోర్ట్, ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ తన లక్ష్యాలకు అనుగుణంగా సొంత విదేశాంగ విధానాన్ని కొనసాగించవచ్చునని వేదాంత్ పటేల్ అన్నారు. అయితే ఇరాన్‌కు అమెరికా ఆంక్షలు ఉన్నాయని, వాటిని తాము అమలు చేస్తూనే ఉంటామని అన్నారు. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పామని, ఏ సంస్థ అయినా, ఇంకెవరైనా ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలను పరిగణనలోకి తీసుకునే ముందు అమెరికా చేబట్టబోయే ఆంక్షల గురించి కూడా తెలుసుకోవాలని ప్రస్తావించారు. చబహార్ పోర్టుపై ఇరాన్‌, భారత్ ఒప్పందం కుదుర్చుకున్నాయంటూ మీడియా ప్రశ్నించిగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. 

కాగా ఇరాన్‌లోని చబహార్ పోర్టును ఉపయోగించుకునేందుకు భారత్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఓడరేవులో టెర్మినల్‌ను భారత్ పదేళ్లపాటు నిర్వహించనుంది. ఈ ఒప్పందంతో ప్రాంతీయ అనుసంధానం పెరగడంతో పాటు వాణిజ్య సంబంధాలు పెరగనున్నాయి.
India
Iran
USA
Chabahar port

More Telugu News