Bandi Sanjay: నీ ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే! నువ్వు మాట్లాడితే సెక్యులర్... నేను మాట్లాడితే మతతత్వమా?: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

  • నీ గడీలు బద్దలు కొట్టింది... మెడలు వంచింది... ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి నిలబెట్టింది తానేనని వ్యాఖ్య
  • 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడకుండా 20 శాతం ఉన్న ముస్లింల గురించి కేసీఆర్ మాట్లాడారని ఆగ్రహం
  • కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Bandi Sanjay fires at KCR for his comments in Karimnagar

'నీ గడీలు బద్దలు కొట్టింది బండి సంజయే... నీ మెడలు వంచింది బండి సంజయే... నిన్ను ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి ధర్నా చౌక్ వద్ద నిలబెట్టింది బండి సంజయే... నీ ప్రభుత్వాన్ని గద్దె దించింది బండి సంజయే... ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడింది బండి సంజయ్... బీజేపీ కార్యకర్తలే. అందుకే నా మీద (కేసీఆర్) కసితో ఉన్నావ్. హిందూ ధర్మం మీద కసితో ఉన్నావ్. హిందువులు అంటే కోపంతో ఉన్నావ్. హిందూ దేవుళ్లంటే భయంతో ఉన్నావ్' అని కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. నిన్న కరీంనగర్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బండి సంజయ్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కరీంనగర్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ మతం గురించి మాట్లాడితే సెక్యులర్... మేం మాట్లాడితే మతతత్వమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నిన్న కరీంనగర్‌కు వచ్చి 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడకుండా... 20 శాతం ఉన్న ముస్లింలను ఒక్కటి కావాలని పిలుపునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుగాళ్లు... బొందుగాళ్లు అన్న కేసీఆర్‌కు కరీంనగర్ ప్రజలు బుద్ధి చెప్పారని... ఇప్పుడు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెట్టిన పోలీస్ వలయాన్ని ఛేదించుకుని హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లి జైశ్రీరామ్ అని గర్జించిన వ్యక్తిని తానే నన్నారు.

హిందువుల కోసం... కరీంనగర్ అభివృద్ధి కోసం పని చేస్తా

తాను సూటిగా చెబుతున్నానని... తాను హిందువుల కోసం పని చేస్తానని, కరీంనగర్ అభివృద్ధి కోసం పని చేస్తానని, మోదీ బాటలో పయనిస్తానని చెప్పారు. కరీంనగర్‌కు వచ్చిన కేసీఆర్ ఓ వర్గం ఓట్లను ఏకం కావాలని చెబుతున్నారని... ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆ మతం పుచ్చుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అని సవాల్ చేశారు. హిందూ ధర్మాన్ని హేళన చేసేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని... దీనిని అందరూ గుర్తించాలన్నారు. తాను మతం గురించి ఎప్పుడూ మొదట మాట్లాడలేదని... ఇప్పుడు కూడా కేసీఆర్ వచ్చి ఓ వర్గానికి అనుకూలంగా మాట్లాడితే తాను మీడియా ముందుకు వచ్చానన్నారు. హిందువులంతా ఒక్కటైతే ఎలాంటి గుణపాఠం ఉంటుందో నిరూపించుదామన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలారా... బండి సంజయ్ హిందువుల గురించి, హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నారని, మీ కోసం కొట్లాడే వ్యక్తిని తాను మాత్రమే అన్నారు. వారు మతం గురించి మాట్లాడితే సెక్యులర్, నేను మాట్లాడితే మతతత్వమా? అని నిలదీశారు. కేసీఆర్ కరీంనగర్‌కు వచ్చి తమాషాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కేటీఆర్ భైంసాకు వెళితే హనుమాన్ భక్తులు నిలదీశారని గుర్తు చేశారు. అసలు ముస్లింలు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. మేం ధర్మం కోసం, అభివృద్ధి కోసం రాజకీయం చేస్తామన్నారు.

అప్పుడు కేటీఆరే అధికారం చెలాయించారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆరే అధికారం చలాయించారని విమర్శించారు. తండ్రి కంటే కేటీఆరే ఎక్కువగా దాదాగిరి, గూండాగిరి చేశారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సిరిసిల్లలోని సమస్యలను మాత్రం పరిష్కరించలేదని విమర్శించారు. అధికారం పోయాక కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరణ దూషణలకు దిగుతున్నాయన్నారు. నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారని ఆరోపించారు. నేతన్నలకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తామని చెప్పి మోసగించారన్నారు.

  • Loading...

More Telugu News