Komatireddy Venkat Reddy: వచ్చే పదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రానున్న పదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తనకు పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూన్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారన్నారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారని తెలిపారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 అసెంబ్లీ సీట్లు అవుతాయని... ఇందులో 125 కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్యం కేసులో ఇరుక్కొని తెలంగాణ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను చూస్తే నవ్వు వస్తోందన్నారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుందనుకున్నామని... కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకొని తిరుగుతుందని గుర్తించలేకపోయామని ఎద్దేవా చేశారు. 

తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉందని, అయినప్పటికీ తలసాని మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. కేసీఆర్‌ని ఫుట్‌బాల్ ఆడుకుంటానన్న తలసాని... తర్వాత మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టినప్పుడు మూడు రాత్రులు తాను కనీసం గది నుంచి కాలు బయట పెట్టలేదన్నారు. కొందరు డిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నారన్నారు. కానీ తాను మాత్రం ఎక్కడికీ వెళ్ళలేదన్నారు.
Komatireddy Venkat Reddy
Congress
BRS
Revanth Reddy

More Telugu News